(ఈనాడు) రాష్ట్రంలోని రైతులందరికీ గడువులోగా ఏక కాలంలో రూ. 2 లక్షల వరకు రుణ మాఫీ చేయాలని మంత్రి మండలి నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. 2018 డిసెంబరు 12 నుంచి 2023 డిసెంబరు 9 వరకు ఐదేళ్ల కాలంలో రైతులు తీసుకున్న రూ.2 లక్షల లోపు రుణాలన్నీ మాఫీ చేయనున్నట్లు తెలిపారు. గతంలోనే ప్రకటించినట్లుగా ఆగస్టు 15వ తేదీ లోగానే రుణమాఫీ ప్రక్రియను పూర్తి చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని స్పష్టం చేశారు.
సచివాలయంలో శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రైతు రుణ మాఫీ, రైతు భరోసాపై మంత్రి మండలి సమావేశం జరిగింది. రుణ మాఫీ విధివిధానాలను పూర్తి స్థాయిలో చర్చించిన తరువాత మంత్రివర్గం ఆమోదించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు త్వరలోనే జారీ కానున్నాయి. ‘రైతు భరోసా’ విధివిధానాలపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటైంది. ఈ కమిటీ రైతు సంఘాలు, రైతు కూలీ సంఘాలు, ప్రతిపక్షాలు తదితరులతో చర్చించి జులై 15 నాటికి నివేదిక ఇవ్వనుంది.
మంత్రి మండలి సమావేశం వివరాలను సీఎం రేవంత్ రెడ్డి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కొండా సురేఖ, సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు, దామోదర్ రాజనర్సింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నా రెడ్డి, విప్ ఆది శ్రీనివాస్ తదితరులు విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి తెలిపిన వివరాలు ఆయన మాటల్లోనే…
— ‘ఆరు నెలల్లో మేం వంద రోజుల పరిపాలనే చేశాం. దాదాపు రెండున్నర నెలలు ఎన్నికల కోడ్లో పోయింది. ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు మీ ముందుకు వచ్చాం.
— గత ప్రభుత్వం రెండు సార్లు రుణ మాఫీ చేసింది. తొలిసారి 2014 మార్చి 31ని కటాఫ్గా తీసుకుని రూ.16 వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేసింది. రెండోసారి 2018 డిసెంబరు 11ని కటాఫ్గా తీసుకుని రైతుల ఖాతాల్లో వేసిన నిధులు రూ.12 వేల కోట్లు. గత పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం రెండుసార్లు రుణమాఫీ కోసం చెల్లించిన నిధులు రూ.28 వేల కోట్లు.
— గత ప్రభుత్వం 2018 డిసెంబరు 11 కటాఫ్గా తీసుకుంటే, మా సర్కారు 2018 డిసెంబరు 12 నుంచి 2023 డిసెంబరు 9 వరకు కటాఫ్గా తీసుకుంది. ఈ ఐదేళ్లలో రాష్ట్రంలో రైతులు తీసుకున్న రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఇందుకోసం దాదాపు రూ.31 వేల కోట్లు అవసరం.
— గత ప్రభుత్వం నాలుగు విడతల్లో చేస్తామని, వడ్డీ చెల్లిస్తామని, నిర్ణయాలను వాయిదా వేస్తూ, రైతులను సంక్షోభంలోకి నెట్టి, వారి ఆత్మహత్యలకు కారణమైంది.
— గత ప్రభుత్వం అమలు చేసిన రైతుబంధుపై ఎన్నో ఆరోపణలున్నాయి. జాతీయ రహదారులుగా మారిపోయిన భూములకు, అపర కుబేరులకు, చివరకు గజ్వేల్లో కేసీఆర్ భూములకు కూడా రైతుబంధు నిధులిచ్చారన్న విమర్శలున్నాయి.
— మేం నాలుగు గోడల మధ్య నిర్ణయాలు తీసుకుని అమలు చేయడం లేదు. అందరితో చర్చించి, సూచనలు, సలహాలు తీసుకుని ‘రైతు భరోసా’ పథకాన్ని పారదర్శకంగా అర్హులకు అందేలా అమలు చేస్తాం. రైతులు, రైతుకూలీ సంఘాలు, ప్రజా సంఘాలతో చర్చించి.. విధివిధానాలను రూపొందించేందుకు ఆర్థిక శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశాం. ఇందులో తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ జులై 15లోగా నివేదిక ఇస్తుంది. దాన్ని బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టి, అర్హులైన వారికి అమలు చేస్తాం.
— కొన్ని పత్రికలు, టీవీలు, రాజకీయ పార్టీల సొంత మీడియా సంస్థలు ప్రభుత్వ పరిపాలనపై చర్చల పేరిట రాద్ధాంతాలు చేస్తున్నాయి. ప్రభుత్వం మీద అపోహలు కల్పించేందుకు లేని విషయాలను ప్రశ్నల రూపంలో అడిగి, ఏదో సమాధానం తీసుకుని, దానికి ప్రచారం కల్పించి సర్కారు ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ప్రభుత్వం తరఫున మీడియాకు సమాచారం ఇచ్చే బాధ్యతలను శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి తీసుకుంటారు. ప్రభుత్వానికి సంబంధించిన అంశాలు, వివరాలపై వారిద్దరూ చెప్పేదే అధికారిక సమాచారం. రాజకీయాలకు సంబంధించిన విషయాలపై అందరూ మాట్లాడతారు. కానీ ప్రభుత్వ పరిపాలనకు సంబంధించి వీరిద్దరే స్పందిస్తారు. వివిధ శాఖల సమాచారం, వివరాలను ఆయా శాఖల మంత్రులు యథావిధిగా తెలియజేస్తారు’’ అని సీఎం రేవంత్ వివరించారు.
రైతు రుణమాఫీకి సంబంధించిన మార్గదర్శకాలు మూడు, నాలుగు రోజుల్లో వెల్లడి కానున్నట్లు తెలిసింది. దీనిపై ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడడానికి కొంత సమయం పడుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎలాంటి సందిగ్ధత లేకుండా స్పష్టమైన మార్గదర్శకాలు ఉండాలని అధికారులకు మంత్రివర్గం స్పష్టం చేసినట్లు తెలిసింది.
పీఎం కిసాన్ యోజన మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకుని రుణమాఫీని అమలు చేయనున్నారు. అయితే అందులో ఉన్న మార్గదర్శకాలు పూర్తిగా కాకుండా, ఎక్కువ మంది రైతులకు ప్రయోజనం కలిగేలా రాష్ట్రంలో రుణమాఫీ అమలుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. మార్గదర్శకాలు సోమవారం వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
శుక్రవారం మంత్రివర్గ సమావేశంలో కేవలం రుణమాఫీ, రైతు భరోసా గురించి మాత్రమే చర్చించినట్లు సమాచారం. ఈ రెండూ అత్యంత ప్రాధాన్యమైనవి, మొత్తం రైతాంగానికి సంబంధించినవి కాబట్టి ఇతర అంశాలేవీ ఎజెండాలో లేవని సంబంధిత వర్గాలు తెలిపాయి.