(ఈనాడు) పంద్రాగస్టులోపు రూ. 2 లక్షల వరకు పంట రుణాల మాఫీ అమలుకు విధివిధానాలపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అర్హులైన వారికే రుణమాఫీ వర్తింపజేసేందుకు అధికారులు వివిధ ప్రతిపాదనలను సమర్పిస్తున్నారు. పాస్‌బుక్‌లు, రేషన్‌ కార్డులను ప్రామాణికంగా తీసుకోవాలని తాజాగా వారు ప్రభుత్వానికి సూచించినట్లు తెలిసింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఆదాయపన్ను చెల్లించే వారు, ఉద్యోగులను దీని నుంచి మినహాయించాలని మంత్రిమండలి సమావేశ ఎజెండాలో ప్రతిపాదించినట్లు సమాచారం.

పంట రుణాల మాఫీపై ఈ వారంలో సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వాలని ఆదేశించడంతో వ్యవసాయాధికారులు రూ.2 లక్షల వరకు రుణాలు తీసుకున్న వారి జాబితాను బ్యాంకుల నుంచి తెప్పిస్తున్నారు. మరో రెండు, మూడు రోజుల్లో ఈ జాబితా అధికారులకు చేరనుంది. ఈలోపే రుణమాఫీని ఎవరెవరికి అమలు చేయాలనే దానిపై వ్యవసాయశాఖ వివిధ ప్రామాణికాల ప్రాతిపదికన విస్తృతస్థాయిలో అధ్యయనం చేస్తోందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 

రైతు బంధు పథకం కింద రాష్ట్రంలో 66 లక్షల మంది లబ్ధిదారులు ఉండగా రూ.2 లక్షల లోపు రుణాలు పొందిన వారు దాదాపు ఇంత మందే ఉంటారని అధికారులు భావిస్తున్నారు. రైతుబంధు లబ్ధిదారుల్లో దాదాపు ఆరు లక్షల మందికి పట్టాదారు పాస్‌బుక్‌లు లేవు. వాటిని ప్రామాణికంగా తీసుకుంటే రుణమాఫీ లబ్ధిదారుల సంఖ్య 60 లక్షలకు తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు.

మరోవైపు కుటుంబంలోని ఇద్దరు, ముగ్గురికి రైతుబంధు వస్తోంది. వారందరికీ రేషన్‌ కార్డుల్లేవు. కుటుంబ పెద్దకు మాత్రమే ఉంది. రేషన్‌కార్డు నిబంధన పెడితే కుటుంబంలో రైతుకు మాత్రమే రుణమాఫీ వర్తిస్తుందని తద్వారా మరో 18 లక్షల మంది తగ్గే అవకాశం ఉందని అధికారులు నివేదిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయపన్ను చెల్లింపుదారులు ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను మినహాయిస్తే మరో రెండు లక్షల మంది తగ్గుతారని చెబుతున్నారు. ఇలా పాస్‌బుక్, రేషన్‌కార్డు, ఆదాయపన్ను చెల్లింపుదారులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధుల తొలగింపు నిబంధనల వల్ల 40 లక్షల మంది మేరకే రుణమాఫీ పథకం పరిధిలోకి వస్తారని అధికారులు నివేదిస్తున్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 36 లక్షల మందికి పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకం కింద సాయం అందుతోంది. రుణమాఫీ కోసం ఈ పథకం విధివిధానాల మీదా చర్చ నడుస్తున్నా ఆ నిబంధనలను యథాతథంగా దీనికి వర్తింపజేయడం ఇబ్బందికరంగా మారుతుందని ప్రభుత్వం భావిస్తోంది.  

కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తేదీని పరిగణనలోకి తీసుకొని అంతకు సంవత్సరం ముందు నుంచి తీసుకున్న రుణాలనే మాఫీ చేయాలని కొందరు అధికారులు ప్రతిపాదించారు. దీనికి ప్రభుత్వం విముఖత చూపింది. 2018 డిసెంబరు 12 నుంచి తీసుకున్న పంట రుణాలు, రెన్యువల్‌ అయిన వాటికి మాఫీ అమలు చేయాలని యోచిస్తోంది. దీనికి అనుగుణంగా రుణగ్రహీతల వివరాలను సేకరించాలని సూచించింది.

రుణమాఫీకి సంబంధించి పలు ప్రతిపాదనలు రాగా.. దీనిపై మంత్రి మండలిలో సమగ్రంగా చర్చించాకే నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. అర్హులకు దీనిని వర్తింపజేయాలని యోచిస్తోంది. అమలు క్రమంలో గ్రామం నుంచి రాష్ట్రస్థాయి వరకు విజిలెన్స్‌ సెల్‌ ఏర్పాటు సన్నాహాల్లో ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

Tags

Categories

Wait, does the nav block sit on the footer for this theme? That’s bold.

Where the mind is without fear

Explore the style variations available. Go to Styles > Browse styles.