(ఈనాడు) ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్తు కొనుగోలు, భద్రాద్రి, యాదాద్రి థర్మల్ విద్యుత్తు కేంద్రాల నిర్మాణాంశాల్లో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై విచారణ కమిషన్ను ఏర్పాటు చేయడాన్ని మాజీ సీఎం, భారాస అధినేత కేసీఆర్ హైకోర్టులో సవాల్ చేశారు.
హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎల్. నరసింహారెడ్డితో న్యాయ విచారణ కమిషన్ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ఇంధన శాఖ మార్చి 14న జారీ చేసిన జీవో విచారణ కమిషన్ల చట్టానికి, విద్యుత్తు చట్టానికి విరుద్ధమంటూ కేసీఆర్ మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు.
విద్యుత్తు కొనుగోళ్లు, సరఫరా ఒప్పందాలు, వివాదాలపై విచారించే పరిధి రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి (ఎస్ఈఆర్సీ)కి మాత్రమే ఉందని పేర్కొన్నారు. విద్యుత్తు చట్టం ప్రకారం కమిషన్ను ఏర్పాటు చేసే అధికారం ప్రభుత్వ పరిధిలో లేదన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో కేంద్రం తీసుకువచ్చిన విద్యుత్తు చట్టంలోని సెక్షన్ 61, 62, 86లకు విరుద్ధమని, దీనిపై రాష్ట్ర సర్కారు అధికారాలు పరిమితమన్నారు. ప్రభుత్వం విచారణకు నిర్దేశించిన అంశాలన్నీ ఎస్ఈఆర్సీ పరిధిలోనివేనని స్పష్టం చేశారు.
కమిషన్ విచారణ సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని, కమిషన్ ఏర్పాటు చట్టవిరుద్ధమని సమగ్ర వివరాలతో లేఖ రాసినా ఛైర్మన్గా జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి కొనసాగడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. లేఖ రాసిన తరువాత కూడా తమ ఎదుట హాజరై ఆధారాలను సమర్పించాలంటూ కమిషన్ ఈ నెల 19న జారీ చేసిన ప్రొసీడింగ్స్ విచారణ కమిషన్ల చట్టం-1952కు విరుద్ధమని, దీన్ని రద్దు చేయాలని కోరారు.
ఇందులో ఇంధనశాఖ ముఖ్యకార్యదర్శి, విచారణ కమిషన్, వ్యక్తిగత హోదాలో కమిషన్ ఛైర్మన్ జస్టిస్ ఎల్.నరసింహారెడ్డిని ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ పిటిషన్ ప్రస్తుతం హైకోర్టు రిజిస్ట్రీ పరిశీలనలో ఉంది.
పిటిషన్లో కేసీఆర్ పేర్కొన్న ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.
— ‘విద్యుదుత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు అన్ని అనుమతులు తీసుకున్నాం. విద్యుత్తు చట్టం 2003 కింద ఏర్పాటైన ఎస్ఈఆర్సీ సమగ్ర విచారణ జరిపి ఉత్తర్వులు జారీచేసే న్యాయవ్యవస్థ. ఈఆర్సీ జారీ చేసిన ఉత్తర్వులకు రక్షణ ఉంది. వీటిని ప్రభుత్వం, ప్రభుత్వ అధికారులు, ట్రైబ్యునల్, కమిషన్, సభ్యులు ఎవరూ ప్రశ్నించడానికి అవకాశం లేదు.
— ఈఆర్సీ పరిధిలోని అంశాలపై ఎవరికైనా అభ్యంతరాలుంటే అది నిర్వహించే ప్రజాభిప్రాయ సేకరణలో వెల్లడించవచ్చు. ఈఆర్సీ నిర్ణయాలపై అభ్యంతరాలుంటే అప్పిలేట్ ట్రైబ్యునల్ను, ఆపై సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు. ఉత్పత్తి, సరఫరా, పంపిణీ తదితర అన్ని అంశాలనూ ఎస్ఈఆర్సీ పరిధిలోనే విచారణ చేయాలి. వీటిపై మరెక్కడా విచారణ చేపట్టరాదంటూ గుజరాత్ ఊర్జా వికాస్ వర్సెస్ ఏఆర్ పవర్ లిమిటెడ్ కేసులో సుప్రీంకోర్టు పేర్కొంది.
— చట్టప్రకారం ఎస్ఈఆర్సీ వంటి జ్యుడిషియల్ సంస్థ నిర్ణయాలపై ఎలాంటి విచారణ అవసరం లేదని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన కమిషన్ ఛైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి నాకు నోటీసు జారీ చేశారు. నేను స్పందించేలోపే జస్టిస్ నరసింహారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించడం అసంతృప్తి కలిగించింది.
— ఎంవోయూ కుదుర్చుకునే నాటికి, విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు చేసుకునే నాటికి ఛత్తీస్గఢ్లో సంబంధిత పవర్ ప్లాంట్లు లేవని, భద్రాద్రి ప్రాజెక్ట్లో సబ్ క్రిటికల్ సాంకేతికతను వినియోగించడం వల్ల రూ.250 కోట్ల నుంచి రూ. 300 కోట్ల నష్టం వాటిల్లిందని ఆయన విలేకరులకు చెప్పారు. నేను సమాధానం ఇచ్చేలోపే ఇలా ప్రకటించడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం.
— జస్టిస్ నరసింహారెడ్డి నిష్పాక్షికంగా వ్యవహరించడంలేదు. ముందే ఒక నిర్ణయానికి వచ్చి నేను (కేసీఆర్) తప్పు చేసినట్లుగా విలేకరుల సమావేశంలో మాట్లాడడాన్ని బట్టి.. ఈ విచారణ నామమాత్రమేనని భావించాల్సి వస్తోంది. దీనివల్ల వివరాలను కమిషన్కు సమర్పించడం వల్ల ప్రయోజనం ఉండదు.
— ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్తు కొనుగోలుకు సంబంధించిన ఒప్పందాలపై తెలంగాణ తెలుగుదేశం పార్టీ అప్పటి కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఎ.రేవంత్ రెడ్డి కూడా ఎస్ఈఆర్సీలో అభ్యంతరాలు దాఖలు చేశారు. అందరి వాదనలు విన్నాకే ఈఆర్సీ ఉత్తర్వులు జారీ చేసింది. వీటిపై అప్పట్లో రేవంత్రెడ్డి అప్పిలేట్ ట్రైబ్యునల్కు వెళ్లలేదు. కానీ ఆయన ఇటీవల ముఖ్యమంత్రి అయ్యాక, ఆ అధికారాన్ని ఉపయోగించి న్యాయ విచారణ కమిషన్ను ఏర్పాటు చేశారు.
— ప్రజాప్రయోజనాలకు సంబంధించిన అంశాలుంటేనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విచారణ కమిషన్ను ఏర్పాటు చేయవచ్చు. కానీ గత ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాల్జేయడానికే ప్రస్తుత ప్రభుత్వం కమిషన్ను ఏర్పాటు చేసింది. అందువల్ల దీని ఏర్పాటుకు సంబంధించిన జీవోను కొట్టివేయాలి. కమిషన్ జారీ చేసిన నోటీసును రద్దు చేయాలి’ అని కేసీఆర్ తన పిటిషన్లో హైకోర్టును అభ్యర్థించారు.